బైండ్ ఓవర్ కేసులు ఉన్నా... బరితెగించిన రేషన్ బియ్యం మాఫియా?
బైండ్ ఓవర్ కేసులు ఉన్నా... బరితెగించిన రేషన్ బియ్యం మాఫియా?
ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం, ప్రగడవరం:
పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యంపై అక్రమార్కుల కన్ను ఇంకా తొలగలేదా? బైండ్ ఓవర్ కేసులు నమోదైనా అక్రమ దందా ఏమాత్రం తగ్గలేదా? ప్రగడవరం గ్రామంలో వినిపిస్తున్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి.
స్థానికుల కథనం ప్రకారం, గ్రామంలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారానికి కేంద్రబిందువుగా మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి వద్ద భారీ మొత్తంలో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. గతంలో ఇదే వ్యవహారంలో బైండ్ ఓవర్ కేసులు నమోదైనా, అక్రమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
"అధికారులు పగలు కాదు... రాత్రి ఆకస్మికంగా దాడులు చేస్తే అసలు గుట్టు బయటపడుతుంది. భారీ నిల్వలు, అక్రమ రవాణా మొత్తం వెలుగులోకి వస్తుంది" అంటూ గ్రామస్థులు అంటున్నారు.
ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? పేదలకు చేరాల్సిన బియ్యం ఎవరెవరి చేతుల్లోకి వెళ్తోంది? అక్రమ దందాకు అండదండలు ఎవరివి? అనే ప్రశ్నలు ఇప్పుడు స్థానికుల్లో చర్చనీయాంశంగా మారాయి.
జిల్లా విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు తక్షణమే ప్రగడవరం గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలికితీయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణల్లో నిజానిజాలు తేల్చి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.