పండరీపురంలో భారీ చోరీ.. ఇంటి తాళాలు పగలగొట్టి అపహరణ
పండరీపురంలో భారీ చోరీ.. ఇంటి తాళాలు పగులగొట్టి నగదు, బంగారం అపహరణ
చిలకలూరిపేట: తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించిన దుండగులు అదును చూసుకుని చోరీకి పాల్పడ్డారు. చిలకలూరిపేట పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని పండరీపురం 9వ లైనులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. పండరీపురం 9వ లైనులో కొమ్మబోయిన వెంకట శివరావు (64) తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నెల 1న దంపతులు హుబ్లీలో నివసిస్తున్న తమ కుమారుడి వద్దకు వెళ్లారు. దీంతో ఇంటికి తాళం వేసి ఉండగా, గురువారం రాత్రి ఇంట్లో లైట్లు వెలుగుతుండటాన్ని ఇరుగుపొరుగు వారు గమనించారు. అనుమానం వచ్చి ఇంటి వద్దకు వెళ్లి పరిశీలించగా చోరీ జరిగిన విషయం బయటపడింది.
దుండగులు ఇంటి మెయిన్ గేటుకు ఉన్న తాళాన్ని మాత్రం అలాగే ఉంచి, ప్రధాన ద్వారం తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. అనంతరం బీరువాలో ఉన్న సుమారు 2 సవర్ల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు, రూ.లక్ష నగదును అపహరించినట్లు బాధితులు తెలిపారు.
ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని ముందుగానే గుర్తించిన దుండగులే ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఆగస్టు 11 లేదా 12 తేదీల మధ్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. బాధితులు, ఇరుగుపొరుగు వారిని అడిగి వివరాలు సేకరించారు. చోరీ జరిగిన తీరును బట్టి ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేసు నమోదు చేసి దుండగుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.