పోలవరం గ్రామంలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం
నవోదయం 2.0లో భాగంగా ఎక్సైజ్ అధికారుల తనిఖీలు.. ఇద్దరిపై కేసులు
చాట్రాయి: నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో వాహనాల తనిఖీలు చేపట్టగా 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బి. శ్రీలత, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కే. నాగ ప్రభు కుమార్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎ. అవులయ్య ఆదేశాల మేరకు నూజివీడు ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా పోలవరం గ్రామంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన భూక్యా వరప్రసాద్ నాయక్, తండ్రి వెంకటేష్ వద్ద 10 లీటర్ల నాటుసారా గుర్తించారు.
అతని వద్ద ఉన్న నాటుసారాతో పాటు సుజుకి యాక్సెస్ 125 ద్విచక్ర వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాటుసారాను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారు అనే విషయాలపై అధికారులు విచారణ చేపట్టగా, విసన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి తండాకు చెందిన బాణావతు రమేష్, తండ్రి పాపారావుకు నాటుసారా సరఫరా చేస్తున్నట్లు వరప్రసాద్ నాయక్ తెలిపినట్లు అధికారులు పేర్కొన్నారు.
దీంతో నాటుసారా సరఫరాకు సంబంధించి బాణావతు రమేష్పై కూడా కేసు నమోదు చేసినట్లు నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య తెలిపారు. నాటుసారా అక్రమ రవాణా, విక్రయాలు, తయారీపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
నాటుసారా తయారీ, విక్రయాలపై ప్రత్యేక నిఘా
నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు, నిల్వ, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నాటుసారాను తయారు చేసినా, విక్రయించినా, అక్రమంగా కలిగి ఉన్నా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లాన్ని అక్రమంగా సరఫరా చేసే వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లపు ఊటను తమ భూముల్లో నిల్వ ఉంచే భూ యజమానులపైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బెల్ట్ షాపులపైనా చర్యలు
నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై కూడా నిఘా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు నిర్వహించడం, నాటుసారా విక్రయించడం వంటి కార్యకలాపాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సమాచారం అందిస్తే గోప్యంగా ఉంచుతాం
తమ ప్రాంతాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు, అక్రమ రవాణా, నిల్వ లేదా బెల్ట్ షాపుల నిర్వహణకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసినట్లయితే వెంటనే ఎక్సైజ్ అధికారులకు తెలియజేయాలని ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య కోరారు.
9440902462 ఫోన్ నంబర్కు సమాచారం అందించిన వెంటనే పరిశీలించి, నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. నాటుసారా నిర్మూలనకు ప్రజలు ఎక్సైజ్ శాఖకు సహకరించాలని కోరారు.