బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి
బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి-- జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
జి.ఓ. ఎం.ఎస్. నెంబర్ .38 ప్రకారం ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.శుక్రవారం రోజున మినీ మీటింగ్ హాల్ లో సాధారణ బదిలీలకు సంబంధించిన సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ. ఎం.ఎస్. నెంబర్ 38 నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఒక కార్యాలయం లేదా విభాగంలో 40 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను బదిలీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ఒకే స్థానంలో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులను కూడా సాధారణ బదిలీల పరిధిలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.బదిలీల ప్రక్రియలో ఎటువంటి వివక్ష లేకుండా సీనియారిటీ, పని చేసిన కాలం, పరిపాలనా అవసరాలను పరిగణనలోకి తీసుకొని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల అభ్యర్థనలు, ఖాళీల వివరాలు, శాఖల అవసరాలను సమన్వయం చేస్తూ నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి,జిల్లా జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.