ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం రాష్ట్రంలో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. శనివారం ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో గరిష్ఠంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఎపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మొత్తం 28 జిల్లాల్లో 17 జిల్లాల పరిధిలోని 239 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కడప జిల్లాలో 34 మండలాలు, నెల్లూరు 32, తిరుపతి 29, పల్నాడు 26, ప్రకాశం 25, మార్కాపురం 21, నంద్యాల 20, కర్నూలు 17, చిత్తూరు 10 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం ఎక్కువగా కనిపించింది.
ఆదివారం వడగాల్పుల హెచ్చరిక
ఆదివారం (03-05-2026) గుంటూరు జిల్లా మేడికొండూరు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తుళ్లూరు, వట్టిచెరుకూరు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కలిపి 124 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశం ఉంది.
ఉష్ణోగ్రతల వివరాలు
కొప్పెరపాడు – 45.4°C
బొట్లగూడూరు – 45.1°C
వెంకటగిరి – 45°C
కలిగిరి – 44.4°C
నూజెండ్ల – 44.3°C
తవణంపల్లె, దొర్నిపాడు – 44.1°C
కలసపాడు – 43.9°C
కారంచేడు – 43.7°C
మంత్రాలయం – 43.2°C
తెరన్నపల్లి – 42.8°C
విజయవాడ తూర్పు – 42.4°C
వర్ష సూచనలు కూడా
రాజస్థాన్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించినట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
జాగ్రత్తలు అవసరం
ఎండ తీవ్రత, ఉక్కపోత కారణంగా ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రైతులు, కూలీలు, పశు కాపరులు ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.