స్థానిక ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరాలి మండలంలోని అన్ని స్థానాలు కైవసం చేసుకునేలా కార్యకర్తలు కృషి చేయాలి మండల టీడీపీ అధ్యక్షుడు ఇజ్జిగాని
చాట్రాయి: రాబోయే స్థానిక సంస్థలు, సర్పంచ్ ఎన్నికల్లో చాట్రాయి మండలంలోని అన్ని స్థానాలను టీడీపీ కైవసం చేసుకునేలా కార్యకర్తలంతా సమష్టిగా కృషి చేయాలని మండల టీడీపీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. చిన్నంపేట గ్రామంలో అత్తులూరి శ్రీనివాసరావు ఇంటి ఆవరణలో ఇజ్జిగాని వెంకటేశ్వరరావు అధ్యక్షతన చాట్రాయి మండల టీడీపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంపై విస్తృతంగా చర్చించారు. రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన బూత్ కన్వీనర్లను అభినందిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు సూచించారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా వివరించడంతో పాటు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా చింతలపూడి రెండో దశ ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ పథకం పూర్తయితే రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగి వ్యవసాయానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని నాయకులు పేర్కొన్నారు. అలాగే కే.కే. రోడ్డులో చనుబండ నుంచి చీపురుగూడెం వరకు రహదారి మరమ్మతులు వెంటనే చేపట్టాలని కోరుతూ మరో తీర్మానం చేశారు. రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతు పనులు చేపట్టాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యకర్తలు సిద్ధం కావాలని, ప్రతి గ్రామంలో పార్టీని మరింత పటిష్టం చేసి టీడీపీ విజయానికి బాటలు వేయాలని ఇజ్జిగాని వెంకటేశ్వరరావు సూచించారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలతో నిరంతరం మమేకం కావాలని, ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేస్తే మండలంలోని అన్ని స్థానాల్లో టీడీపీ విజయాన్ని సాధించడం సాధ్యమవుతుందని అన్నారు. చాట్రాయి మండలంలో టీడీపీకి ఉన్న బలాన్ని మరింత పెంచి రాబోయే ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు, మందపాటి బసవా రెడ్డి, మరిడి వెంకటేశ్వరరావు,(చిట్టిబాబు) బొట్టు లక్ష్మణరావు, బొట్టు రామచంద్రరావు, మాదాసు చంద్రకళ, మాదాసు పుల్లయ్య, దిలీప్, రాజబాబు, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.