వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత
వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత
నంద్యాల | Ntoday News
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 13న కర్నూలు జిల్లా పర్యటనకు సంబంధించి పోలీసుల అనుమతులపై నంద్యాల జిల్లా పోలీసు శాఖ స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఐపీఎస్ వివరాలు వెల్లడించారు.
జైలులో ఉన్న వ్యక్తిని జైలు అధికారుల నిబంధనల ప్రకారం ములాఖాత్ ద్వారా పరామర్శించి తిరిగి వెళ్లేందుకు మాత్రమే పోలీసు అనుమతి వర్తిస్తుందని ఎస్పీ తెలిపారు.
ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి కర్నూలు జిల్లా జైలుకు ములాఖాత్ కోసం వెళ్లేందుకు సంబంధిత నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా పోలీసులు అవసరమైన భద్రతా ఏర్పాట్లు కల్పిస్తారని తెలిపారు.
అయితే బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్షోలు, ప్రజా సమావేశాలు లేదా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
నంద్యాల జిల్లా నుంచి ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కర్నూలుకు వెళ్లి పోలీసుల అనుమతి లేని కార్యక్రమాల్లో పాల్గొని ఇబ్బందులకు గురికావద్దని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.
పోలీసు శాఖ విధించిన నిబంధనలు, చట్టబద్ధమైన ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని ఎస్పీ కోరారు. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
– జిల్లా పోలీసు కార్యాలయం, నంద్యాల