అత్యాచారం కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు.
అత్యాచారం కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు.
మైనర్ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి నల్గొండ ఫాస్ట్ట్రాక్ కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.7 వేల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం అందజేయాలని కోర్టు ఆదేశించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. 2020లో మిర్యాలగూడ-2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై క్రైమ్ నంబర్ 97/2020 కింద కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన మహమ్మద్ జాఖీర్ బాబాను నిందితుడిగా గుర్తించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆధారాలు సేకరించి ఛార్జిషీట్ దాఖలు చేయగా, విచారణ అనంతరం కోర్టు నిందితుడిని ఐపీసీ సెక్షన్ 366, పోక్సో చట్టంలోని సెక్షన్లు 3, 4 కింద దోషిగా నిర్ధారించింది. ఐపీసీ సెక్షన్ 366 కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా, పోక్సో చట్టం కింద 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. శిక్షలు ఏకకాలంలో అమలు కావడంతో మొత్తం 25 ఏళ్ల శిక్ష అమలు కానుంది. జరిమానా చెల్లించకపోతే అదనపు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. కేసులో సమర్థవంతంగా దర్యాప్తు, ప్రాసిక్యూషన్ నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడే వారిపై జిల్లా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని, నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా దర్యాప్తు, ప్రాసిక్యూషన్ ప్రక్రియలను సమర్థవంతంగా కొనసాగిస్తామని ఎస్పీ తెలిపారు.