ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు
ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు
ఆమడగూరు, సత్యసాయి జిల్లా: ఎన్ టుడే న్యూస్ ప్రతినిధి రామాంజనేయులు
ఆమడగూరు మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తం రెడ్డి, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
జయంతి సందర్భంగా అమ్మవారిని కర్ణాటక నుంచి ప్రత్యేకంగా తెప్పించిన వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి వెండి కవచాన్ని అలంకరించి భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
అనంతరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి రథోత్సవానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎండ, వానకు రథం దెబ్బతినకుండా ఉండేందుకు ప్రత్యేకంగా నిర్మించిన ఆలయ సముదాయంలో రథాన్ని భద్రపరిచారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తం రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి, సురేందర్ రెడ్డి, భయ్యా రెడ్డి, వెంకటరెడ్డి, దొడ్డం నరసింహమూర్తి, రమేష్, ఇండ్లూరి లక్ష్మీనారాయణ, మురళి స్వామి, కాటమ రామకృష్ణ, డాక్టర్ సమరం, ఆదినారాయణ, రెడ్డప్ప తదితరులతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.