దేశభక్తికి ప్రతీక ప్రతిజ్ఞ టి.ఉమామహేశ్వర రావు
ఏ.కొండూరు, ఆగస్టు 13: విద్యార్థుల్లో దేశభక్తి, సోదరభావాన్ని పెంపొందించేందుకు పైడిమర్రి వెంకట సుబ్బారావు రచించిన ‘భారతదేశం–నా మాతృభూమి’ ప్రతిజ్ఞ ఎంతో దోహదపడుతుందని తెలుగు భాషా వికాస సమితి అధ్యక్షులు టీ. ఉమామహేశ్వరరావు తెలిపారు.
గురువారం పైడిమర్రి వెంకట సుబ్బారావు వర్ధంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం కోడూరు గ్రామంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యం. రాంప్రదీప్ రచించిన పైడిమర్రి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఉమామహేశ్వరరావు పరిచయం చేసి మాట్లాడారు.
దేశభక్తికి ప్రతీకగా నిలిచిన ప్రతిజ్ఞను ప్రతి విద్యార్థి అర్థం చేసుకొని ఆచరించాలని సూచించారు. దేశం పట్ల బాధ్యత, ఐక్యత, సోదరభావం పెంపొందించడంలో ప్రతిజ్ఞ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది బి. నాగేంద్రరావు, టీ. సుప్రియ తదితరులు పాల్గొన్నారు.