వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ
లక్షెట్టిపేట మండలం, మంచిర్యాల జిల్లా: వెంకట్రావుపేట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యలు, అవసరమైన మౌలిక వసతులపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నలిమేల రాజు మాట్లాడుతూ.. గత గ్రామ సభలో గ్రామ ఆశా వర్కర్లు, సీఏలు తమకు ప్రత్యేకంగా ఆఫీస్ రూమ్ నిర్మించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, ఈ గ్రామ సభలో ఆశా వర్కర్లు, సీఏలకు ఆఫీస్ బిల్డింగ్ మంజూరు అయినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మరిన్ని పనులను చేపట్టేందుకు కృషి చేస్తామని, ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని సర్పంచ్ పేర్కొన్నారు.
అనంతరం గ్రామ సెక్రటరీ వంశీకృష్ణ మాట్లాడుతూ గ్రామ సభ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గ్రామ ఉపసర్పంచ్ కోన తిరుమల మాట్లాడుతూ గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. అలాగే వార్డు మెంబర్లు కూడా తమ తమ వార్డుల్లోని సమస్యలు, అభివృద్ధి పనుల గురించి గ్రామ సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ గ్రామ సభలో అంగన్వాడీ టీచర్లు, పీహెచ్సీ సిబ్బంది, గ్రామ కారోబారి, గ్రామ ప్రజలు పాల్గొని పలు సమస్యలు, గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని గ్రామ సర్పంచ్ నలిమేల రాజు తెలిపారు.