ఇంటి తాళం పగులగొట్టి నగదు, బంగారం, వెండి చోరీ
ఇంటి తాళం పగులగొట్టి నగదు, బంగారం, వెండి చోరీ
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం జువ్విగూడెం గ్రామంలో ఓ ఇంటి తాళం పగులగొట్టి నగదు, బంగారం, వెండి వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. గ్రామానికి చెందిన వంగాల యాదగిరిరెడ్డి (70) గురువారం నార్కట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదగిరిరెడ్డి గురువారం ఉదయం సుమారు 4.20 గంటలకు రోజువారీగా పాలు పిండుకోవడానికి ఇంటి సమీపంలోని బావి వద్దకు వెళ్లారు. తిరిగి ఉదయం 5 గంటలకు ఇంటికి చేరుకోగా తలుపు తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని లాకర్ను పరిశీలించగా రూ.42 వేల నగదు, సుమారు ఆరు తులాల వెండి పట్టీలు, సుమారు ఒక తులం బరువున్న రెండు బంగారు ఉంగరాలు కనిపించలేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి నగదు, బంగారం, వెండి వస్తువులను అపహరించినట్లు బాధితుడు పోలీసులకు తెలిపారు. ఫిర్యాదు మేరకు నార్కట్పల్లి ఎస్సై పి.విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలను సేకరిస్తూ నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.