ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు
ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు
ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని తేది:08.05.2026 శుక్రవారం రోజున జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ భువనగిరిలో తలసేమియా వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు.జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎన్. వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులు, నిపుణులు పాల్గొని తలసేమియా వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు మరియు ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆర్ఎంఓలు డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ తలసేమియా అనేది జన్యుపరమైన లోపాల వల్ల వచ్చే వ్యాధి అని తెలిపారు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోవడం వల్ల రక్తహీనత ఏర్పడి, చిన్నపిల్లలు మరియు యువతలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. అలసట, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎన్. వంశీకృష్ణ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా తలసేమియా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.గర్భధారణ సమయంలోనే వ్యాధి నిర్ధారణ జరిగితే తగిన వైద్య పర్యవేక్షణ ద్వారా సమస్యలను నివారించవచ్చని తెలిపారు.గర్భస్థ మహిళలు తలసేమియా వ్యాధి ఉన్నట్లయితే..తక్కువ బరువు,నెలలు నిండని శిశువు జన్మించే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు.అందుకే ప్రతి కుటుంబం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని,వివాహానికి ముందు,గర్భధారణ సమయంలో 12 వారాలకు ముందు రక్త పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్య పరీక్షల సేవలను సద్వినియోగపర్చుకోవాలని కోరారు.ఈ అవగాహన సదస్సులో చిన్నపిల్లల నిపుణురాలు ప్రొఫెసర్ కవిత, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సాయి రమణి, ఓబీజీ సీసీఎస్ డాక్టర్ జ్యోతి, పాథాలజిస్టులు డాక్టర్ సాయికిరణ్,డాక్టర్ లక్ష్మణ్, డిప్యూటీ ఆర్ఎంఓ తదితరులు పాల్గొని తలసేమియా వ్యాధి నివారణ, చికిత్స, రక్తదాన ప్రాముఖ్యత మరియు ప్రజల్లో అవగాహన పెంపుపై వివరించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గర్భిణీలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.