బాసర ఆలయంలో భారీ చోరీ
నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయం పరిసరాల్లో చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయ పై అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీని దుండగులు అపహరించినట్లు సమాచారం.
దొంగలు హుండీని ఎత్తుకెళ్లి అందులోని నగదును కాజేసి, అనంతరం హుండీని వ్యాసగుడి వద్ద వదిలేసి పరారైనట్లు గుర్తించారు. ఘటనపై ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటి ఆధారంగా దుండగుల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఈ ఘటనతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఆలయ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని భక్తులు కోరుతున్నారు.