కొండమల్లేపల్లిలో మహిళా ప్రిన్సిపాల్ దారుణ హత్య
కొండమల్లేపల్లిలో మహిళా ప్రిన్సిపాల్ దారుణ హత్య
కొండమల్లేపల్లి: నల్గొండ జిల్లాలో మహిళా ప్రిన్సిపాల్ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. కొండమల్లేపల్లి పట్టణంలోని జేబీ కాలనీలో రూపారెడ్డి (45) అనే మహిళను పదునైన కత్తులతో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. రూపారెడ్డి కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు.
భర్త హైదరాబాద్కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. నిన్న సాయంత్రం నుంచే రూపారెడ్డి ఫోన్ స్విచ్ఆఫ్లో ఉన్నట్లు సమాచారం. కొంతసేపటి తర్వాత ఆమె ఇంట్లో హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఇంటిని పూర్తిగా పరిశీలించారు. క్లూస్ బృందం, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగకపోవడం పోలీసుల దర్యాప్తులో కీలక అంశంగా మారింది. హత్యకు దోపిడీ కారణం కాకపోవచ్చనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
మరోవైపు భార్యాభర్తల మధ్య ఎలాంటి తగాదాలు లేవని బంధువులు చెబుతున్నట్లు సమాచారం. ఇంటి కింది భాగంలో అద్దెకు ఉంటున్న వారికి సైతం ఎలాంటి అలికిడి వినిపించలేదని తెలిసింది. దీంతో హత్య ఎప్పుడు, ఎలా జరిగింది? నిందితులు ఎవరు? అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు.
హత్యకు ముందు రూపారెడ్డి ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు, ఆమె ఇంటికి ఎవరైనా వచ్చారా, పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం ఉందా అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో పాటు పరిసర ప్రాంతాల్లోని నిఘా కెమెరాల దృశ్యాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది.
ఈ ఘటనపై పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు దారితీసిన కారణాలను వెలికితీసి నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు వివిధ కోణాల్లో విచారణ సాగిస్తున్నాయి. ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న మహిళ ఇంట్లోనే దారుణ హత్యకు గురికావడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.