ఆటోనగర్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఆటోనగర్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఏలూరు: ఏలూరు టౌన్ ఆటోమొబైల్స్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటోనగర్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆటోనగర్ అసోసియేషన్ కార్యాలయంలో కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షుడు అరుణతార నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా అరుణతార నాగేశ్వరరావు మాట్లాడుతూ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆటోనగర్లో శనివారం ఉదయం 10 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్, అతిథిగా పాలగూడెం పంచాయతీ ప్రత్యేక అధికారి చింతమనేని విష్ణు హాజరుకానున్నట్లు వెల్లడించారు.
అసోసియేషన్ కార్యదర్శి అడపా సత్యనారాయణ మాట్లాడుతూ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆటోనగర్ సభ్యులు, ఆటోమొబైల్ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కర్రి ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, కమిటీ సభ్యులు షేక్ జుల్ఫీ, మంతెన వెంకటేశ్వరరావు, సిగిరెడ్డి సంజీవరావు, బొడ్డు సురేష్, చిట్యాల పూర్ణచంద్రరావు, కార్మిక సంఘం నాయకుడు కురెళ్ల వరప్రసాద్, మాజీ ఉపాధ్యక్షుడు పల్లా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.