టైరు పేలడంతో టాటా ఏస్ బోల్తా.. ముగ్గురు కూలీల దుర్మరణం
తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట మండలం వడిశలేరు–రంగంపేట మధ్య ప్రయాణిస్తున్న టాటా ఏస్ గూడ్స్ వాహనం టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
సామర్లకోట, పిఠాపురం ప్రాంతాలకు చెందిన కూలీలు బాపట్ల జిల్లా కొల్లూరులో రెడీమిక్స్ వాల్ నిర్మాణ పనులు ముగించుకుని స్వగ్రామాలకు తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది. కూలీలతో పాటు నిర్మాణ సామగ్రిని కూడా అదే వాహనంలో తరలిస్తున్న సమయంలో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.
మృతులను సామర్లకోటకు చెందిన మాసకపల్లి బాబు, మురమళ్ల రాజు, కాకాడ రాజుగా గుర్తించారు. గాయపడిన ఎనిమిది మందిని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా టైరు పేలడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.