యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం!
భారత భూమే యోగ భూమి
యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం!
యోగాంధ్ర-2026 విజయానికి విజయవాడ ప్రజలే కారణం!
రాష్ట్ర ప్రభుత్వానికి, విజయవాడ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు -విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని)
విజయవాడ(ఇందిరా గాంధీ స్టేడియం) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో అత్యంత వైభవంగా నిర్వహించిన యోగాంధ్ర-2026 కార్యక్రమం రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని) పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువని, మానవాళి శారీరక, మానసిక ఆరోగ్య వికాసానికి యోగా ఒక అపూర్వ వరమని ఆయన అన్నారు.
ఆదివారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు
అనంతరం ఎంపీ చిన్ని మాట్లాడుతూ, యోగా అనేది కేవలం ఒకరోజు చేసే కార్యక్రమం కాదని, జీవితాంతం అలవర్చుకోవాల్సిన ఆరోగ్య సాధనమని పేర్కొన్నారు. నేటి ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడులు, ఆందోళనలు, ఆరోగ్య సమస్యలకు యోగా ఉత్తమ పరిష్కారమని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా యోగాకు విశిష్ట గుర్తింపు తీసుకువచ్చారని, ఆయన పిలుపుతో యోగా నేడు అంతర్జాతీయ ఉద్యమంగా మారిందని కొనియాడారు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర-2026 కార్యక్రమాన్ని ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించే మహత్తర ఉద్యమంగా నిర్వహిస్తోందని అన్నారు.
వేలాది మంది విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు, అధికారులు ఒకే వేదికపై యోగాభ్యాసం చేయడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. యోగా వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా సామాజిక సామరస్యం, క్రమశిక్షణ, సానుకూల ఆలోచనలకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో యోగా ఒక భాగంగా మారితే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, మంత్రి కందుల దుర్గేష్, మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి సవిత ,డాక్టర్ మంతెన సత్యనారాయణ,తదితరులు పాల్గొనగా, యోగా గురు బాబా రామ్దేవ్ యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
“మన విజయవాడ నగరానికి ఇంత గొప్ప కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం రావడం ఆనందంగా ఉంది. యోగాంధ్ర-2026ను విజయవంతం చేయడానికి కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా వేలాదిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ఘన విజయంగా మార్చిన విజయవాడ ప్రజలకు ప్రత్యేక అభినందనలు. మీ భాగస్వామ్యమే ఈ కార్యక్రమం విజయానికి అసలైన బలం” అని పేర్కొన్నారు ఎంపీ చిన్ని
“ఆరోగ్యవంతమైన వ్యక్తి... ఆరోగ్యవంతమైన కుటుంబం... ఆరోగ్యవంతమైన సమాజం... అదే యోగాంధ్ర లక్ష్యం. ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి” అని ఎంపీ చిన్ని పిలుపునిచ్చారు.