ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి స్ఫూర్తితో బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మిద్దాం – బీసీ రాజ్యాధికారాన్ని సాధిద్దాం
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి 15వ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన బీసీ సమాజ్
బీసీ సమాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సమాజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన విశిష్ట కృషి, త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటి చెప్పడంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. ఈ సందర్భంగా నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆచార్య జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనకే కాకుండా సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం కూడా నిరంతరం పోరాడారని అన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత నేటి తరంపై ఉందన్నారు.
అదేవిధంగా, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో తమ హక్కులను సాధించుకోవడానికి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆచార్య జయశంకర్ గారి స్ఫూర్తితో బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించి, బీసీల రాజ్యాధికార సాధన కోసం కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ఆచార్య జయశంకర్ చూపిన మార్గంలో ముందుకు సాగడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మవరపు బ్రహ్మయ్య, మంచిర్యాల పట్టణ కార్పెంటర్ అధ్యక్షులు పెద్దోజు హనుమంతు, అఖిలభారత విశ్వకర్మ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగంటి శ్రీనివాస్, బీసీ సమాజ్ జిల్లా ఉపాధ్యక్షులు బొలిశెట్టి లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి పొట్టాల మల్లేష్, బీసీ సమాజ్ నాయకులు జక్కం రవీందర్, వెన్నంపల్లి మురళి, గుండ్ల లక్ష్మణ్, ఎండి లతీఫ్, తాటిపాముల సమ్మయ్య, సైనోజు నారాయణ చారి, పల్లపు శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఆచార్య జయశంకర్ గారికి ఘన నివాళులు అర్పించారని బీసీ సమాజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ తెలిపారు