పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
అంగన్వాడీ కేంద్రం సందర్శన, రైతులతో ముఖాముఖి, కేడర్ సమావేశం, ప్రజావేదిక సభలో పాల్గొననున్న సీఎం
చిలకలూరిపేట, జూన్ 19: ముఖ్యమంత్రి జూన్ 20న పల్నాడు జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో పలు అభివృద్ధి, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:55 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న ముఖ్యమంత్రి, మధ్యాహ్నం 12:15 గంటలకు లింగంగుంట్ల హెలిప్యాడ్కు చేరుకోనున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలకనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు లింగంగుంట్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి సౌకర్యాలు, నిర్వహణను పరిశీలించనున్నారు. అనంతరం 12:50 గంటలకు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు, సూచనలను నేరుగా తెలుసుకోనున్నారు.
మధ్యాహ్నం 2:15 గంటల నుంచి టీడీపీ కేడర్ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 3:50 గంటల నుంచి ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
కార్యక్రమాల అనంతరం సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 6:20 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టగా, కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు.