గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభూనిగూడెం గ్రామంలో గర్భిణీ మహిళ, నవజాత శిశువు మృతిచెందిన విషాద ఘటనలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలి చితాభస్మంలో శస్త్రచికిత్సలకు ఉపయోగించే కత్తెర లభించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గ్రామానికి చెందిన వనజ (20) అనే గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సు సాధారణ ప్రసవం చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
నర్సు అనుభవలేమి, నిర్లక్ష్యం కారణంగా శిశువు ప్రసవ సమయంలోనే మృతిచెందిందని, అనంతరం తీవ్ర రక్తస్రావానికి గురైన వనజ చికిత్స పొందుతూ మరణించిందని బంధువులు వాపోయారు.
తల్లీబిడ్డలకు అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం చితాభస్మాన్ని సేకరిస్తుండగా అందులో శస్త్రచికిత్సలకు ఉపయోగించే కత్తెర బయటపడడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఆసుపత్రిలో సాధారణ ప్రసవమే జరిగిందని, ఎలాంటి శస్త్రచికిత్స నిర్వహించలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. చితాభస్మంలో కత్తెర ఎలా వచ్చిందో తమకు తెలియదని వారు పేర్కొన్నారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.