లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన నల్లగొండ డిప్యూటీ ఇన్స్పెక్టర్
భూ సర్వే నివేదిక జారీ చేయడానికి లంచం డిమాండ్ చేసిన ఒక ప్రభుత్వ అధికారి ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు. నల్లగొండ ఆర్డిఓ కార్యాలయంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న జి.పవన్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు. ఏసీబీ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం ఒక భూమికి సంబంధించిన సర్వే రిపోర్టును జారీ చేయాల్సిందిగా బాధితుడు డిప్యూటీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ను ఆశ్రయించారు అని. అయితే, ఆ నివేదిక ఇవ్వడానికి పవన్ కుమార్ రూ. 35,000 లంచం డిమాండ్ చేస్తూ బాధితుడిపై ఒత్తిడి తెచ్చారు. ఇందులో భాగంగా నిందితుడు పవన్ కుమార్ ఇప్పటికే రూ. 20,000 నగదును అడ్వాన్స్గా తీసుకున్నట్లు ఏసీబీ విచారణలో తేలింది.
మిగిలిన రూ. 15,000 లంచం మొత్తాన్ని శుక్రవారం నల్గొండ కలెక్టరేట్ సమీపంలో బాధితుడి నుండి తీసుకుంటుండగా, ముందస్తు వ్యూహంతో నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు పవన్ కుమార్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం సొమ్ము 15,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం, ఏసీబీ అధికారులు నల్లగొండ ఆర్డిఓ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని నిర్బంధించారు. కార్యాలయంలోని రికార్డులను, పవన్ కుమార్కు సంబంధించిన సీట్లను నిశితంగా పరిశీలిస్తూ విస్తృత సోదాలు నిర్వహించారు. విధుల నిర్వహణలో సదరు అధికారి అక్రమ ప్రయోజనం పొందినట్లు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించింది.
కోర్టులో హాజరుపరచనున్న అధికారులు
లంచం తీసుకుంటూ దొరికిపోయిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ జి.పవన్ కుమార్ను అధికారులు అధికారికంగా అరెస్ట్ చేశారు. నిందితుడిని హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు. ఈ అవినీతి నెట్వర్క్పై కేసు నమోదు చేసి, దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అవినీతిపై ఫిర్యాదుకు పిలుపు
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లేదా సిబ్బంది పనుల కోసం లంచం డిమాండ్ చేస్తే వెనకాడకుండా ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ ప్రజలకు సూచించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటానికి 1064 అనే టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆయన స్పష్టం చేశారు.