తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ సార్ 15 వ వర్ధంతి
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం మరియు బీసీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ 15వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, ఐక్య వేదిక అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడారు. అమరవీరుల బలిదానాలతో కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పడిందని, సామాజిక తెలంగాణ సాధన కోసం మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో గత పన్నెన్నర ఏళ్లుగా అతితక్కువ జనాభా కలిగిన వర్గాల పాలన కొనసాగుతోందని, మెజారిటీ వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆధిపత్యం కొనసాగుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలివ్వాలన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, రూ. 50 వేల పెన్షన్, ఉచిత రవాణా సౌకర్యం, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం సామాజిక తెలంగాణ కోసం ఉద్యమకారులు ఏకం కావాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రాళ్లబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, నాయకులు సత్యనారాయణ, రాంరెడ్డి, రాజేశం, చందు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు