జర్నలిస్టులపై సోషల్ మీడియా దుష్ప్రచారంపై డీఎస్పీకి ఫిర్యాదు
నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ, వారిపై సోషల్ మీడియాలో నకిలీ జర్నలిస్టులుగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు శనివారం నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డిని జర్నలిస్టుల సంఘాల నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇటీవల కాలంలో ప్రజా సమస్యలు, సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై నిరంతరం కథనాలు రాసే క్షేత్రస్థాయి విలేకరులను లక్ష్యంగా చేసుకుని కొందరు అసత్య ప్రచారాలకు ఒడిగడుతున్నారని వారు ఆరోపించారు. ముఖ్యంగా 'జనం సాక్షి' దినపత్రిక నల్లగొండ బ్యూరో ప్రతినిధి ఓడపల్లి మధుపై కొందరు నిరాధారమైన, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. జర్నలిస్టుల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్రలను ఎంతమాత్రం సహించబోం అని , మీడియా స్వేచ్ఛను కాపాడుతూ, నిరంతరం వార్తా సేకరణలో ఉండే పాత్రికేయుల భద్రతకు పోలీస్ శాఖ తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పని చేసే విలేకరుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు. జర్నలిస్టులపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేయడం తీవ్ర ఆందోళనకరం. తక్షణమే ఓడపల్లి మధుపై దుష్ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలి.అని డిఎస్పి కి జర్నలిస్టు సంఘాలు విన్నవించారు
సానుకూలంగా స్పందించిన డీఎస్పీ
జర్నలిస్టు సంఘాల ప్రతినిధుల ఫిర్యాదుపై డీఎస్పీ శివరాం రెడ్డి సానుకూలంగా స్పందించారు. చట్టాన్ని గౌరవిస్తూ వార్తలు రాసే జర్నలిస్టులకు రక్షణ ఉంటుందని భరోసా ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా జర్నలిస్టుల ప్రతిష్టకు భంగం కలిగిస్తూ, అసత్య ప్రచారాలు చేస్తున్న వారిని తక్షణమే గుర్తించి, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.