రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి – మెట్రోపై కీలక చర్చలు
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పెండింగ్ అంశాలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి లేఖ రాశారు.
ఈ నెల 16న రాసిన లేఖను ప్రస్తావిస్తూ, తాజా లేఖలో ఈ నెల 22, 23 తేదీల్లో తాను ఢిల్లీ పర్యటనకు వస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.
హైదరాబాద్ నగరం, తెలంగాణ అభివృద్ధికి కీలకమైన ప్రాజెక్టుగా మెట్రో రైలు విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఫేజ్–2 విస్తరణకు సంబంధించిన పెండింగ్ సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేలా కేంద్రం జోక్యం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా వివరించనున్నట్లు తెలిపారు. అవసరమైన ఒప్పందాలు, పత్రాల ప్రతులు కూడా తీసుకువస్తానని పేర్కొన్నారు. సమావేశ ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకుని వివరాలు తెలియజేయాలని కోరారు.