యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి సీతక్క
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ (సీతక్క) పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట పట్టణం, ఆలేరు పట్టణంలో శనివారం రోజున నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ (సీతక్క) ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ,భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న ప్రజాప్రతినిధులకు ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు.దర్శనం అనంతరం ఆలయ అధికారులు లడ్డు ప్రసాదం, తీర్థప్రసాదం అందజేసి వేదాశీర్వచనం చేశారు.తదుపరి యాదగిరిగుట్టలో లబ్ధిదారురాలు శ్రీమతి వడిగల లావణ్య గారి నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. ప్రతి అర్హ కుటుంబానికి గౌరవప్రదమైన నివాసాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.అనంతరం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాల తరగతి గదులను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి మహిళా సంఘాలు అందిస్తున్న సహకారం అభినందనీయమని, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తు మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.తదనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరిత కార్యక్రమాలకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.