‘ఫాదర్ ఆఫ్ స్కామ్స్.. హ్యాపీ ఫాదర్స్ డే’ ప్రధాని మోదీపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వ్యంగ్యాస్త్రాలు
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలనే టార్గెట్గా సెటైర్లు
ఎన్నికల హామీలు ప్రచార నినాదాలుగానే మిగలకూడదని హితవు
ఫాదర్స్ డే (పితృ దినోత్సవం) సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గత పదేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వైఫల్యాలను ఎత్తిచూపుతూ సోషల్ మీడియా వేదికగా ప్రధానికి ఆయన "ప్రత్యేక ఫాదర్స్ డే శుభాకాంక్షలు" తెలిపారు. మోదీని పలు వైఫల్యాలకు ‘ఫాదర్’గా అభివర్ణిస్తూ.. "ఫాదర్ ఆఫ్ డీమోనిటైజేషన్, ఫాదర్ ఆఫ్ డ్రామా-బాజ్ పాలిటిక్స్, మెలోడీ డిప్లొమసీ ఫాదర్, రూపాయి పతనానికి ఫాదర్, ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీకి ఫాదర్, నీట్ పేపర్ లీకులు - స్కామ్ల ఫాదర్, రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీల ఫాదర్, అచ్చే దిన్ ఫాదర్" అంటూ వ్యంగ్యంగా తీవ్ర విమర్శలు చేశారు.
దేశంలో నేడు యువత, నిరుద్యోగులు, రైతులు, సామాన్య ప్రజలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని, పదేళ్ల మోదీ పాలన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఎంపీ వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో పాలకులకు జవాబుదారీతనం అత్యంత కీలకమని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కేవలం ఓట్ల కోసం ప్రచార నినాదాలుగానే మిగిలిపోకూడదని ఆయన హితవు పలికారు. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే కీలక అంశాలపై కేంద్రం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన.. "యే హై ఆజ్ కా భారత్.. హ్యాపీ ఫాదర్స్ డే నరేంద్ర మోదీ జీ.. జై హింద్! జై భారత్!" అంటూ తన సందేశాన్ని ముగించారు