బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తాం: ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య
నూజివీడు పట్టణంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మద్యం నిషేధ చట్టం–1995 (సవరణ చట్టం–2020) ప్రకారం రోడ్లు, పార్కులు, ఆటస్థలాలు తదితర బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం శిక్షార్హమైన నేరమని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ర్యాలీలో పాల్గొన్న అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల మహిళల భద్రతకు భంగం కలగడం, శాంతిభద్రతల సమస్యలు తలెత్తడం, కుటుంబాల్లో కలహాలు పెరగడం, యువత చెడు ప్రభావాలకు గురికావడం, పరిసరాల పరిశుభ్రత దెబ్బతినడం వంటి దుష్పరిణామాలను వివరించారు.
ప్రభుత్వం అనుమతించిన పర్మిట్ రూములు, బార్లలో మాత్రమే మద్యం సేవించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మద్యం దుర్వినియోగం వల్ల కలిగే సామాజిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన నష్టాలను గుర్తించి మద్యపాన నియంత్రణలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల కార్యక్రమంలో భాగంగా నూజివీడు స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నట్లు ఎ. మస్తానయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రజలు చట్టాన్ని గౌరవించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా సహకరించాలని అధికారులు కోరారు.