యోగాంధ్ర-2026లో మంత్రి కొలుసు పార్థసారథి యోగా ఆసనాలు
ఏలూరు/నూజివీడు, జూన్ 21:
12వ అంతర్జాతీయ యోగాంధ్ర-2026 దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం తన స్వగృహంలో యోగా ఆసనాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యోగాంధ్రతో రాష్ట్ర ప్రజలు ఆరోగ్యం వైపు అడుగులు వేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. యోగా ఆరోగ్యవంతమైన నవసమాజ నిర్మాణానికి దోహదపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం యోగాకు కేటాయించాలని ఆయన సూచించారు.
రాష్ట్ర ప్రజలకు, నూజివీడు నియోజకవర్గ ప్రజలకు అంతర్జాతీయ యోగాంధ్ర-2026 శుభాకాంక్షలు తెలిపారు. యోగా ఒక ఆధ్యాత్మిక సాధనగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి తోడ్పడుతుందని చెప్పారు. యోగా ద్వారా ఒత్తిడి, ఆందోళన తగ్గి ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు యోగా ప్రాధాన్యతకు విశిష్ట స్థానం కల్పిస్తున్నారని అన్నారు. నేటి కాలంలో పిల్లలు నుండి పెద్దల వరకు ఒత్తిడులు పెరుగుతున్నాయని, వాటి నివారణకు యోగా అవసరమని సూచించారు.
యోగా ఒక్కరోజు కార్యక్రమం కాదని, నిరంతర సాధన అని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య బాధ్యతను స్వయంగా తీసుకోవాలని మంత్రి పార్థసారథి అన్నారు.