తిరువూరు లో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఘనంగా యోగ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొలికపూడి సీనివాసరావు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగాభ్యాసం శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. విద్యార్థినులు చిన్న వయసు నుండే యోగాను అలవాటు చేసుకుంటే జీవితాంతం ఆరోగ్యంగా ఉండగలరని సూచించారు.
భారతదేశం యోగను ప్రపంచానికి అందించిన గొప్ప వారసత్వమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి వల్లే యోగకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి ఎనారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు.
ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు యోగాభ్యాసం చేయాలని విద్యార్థినులు, తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సర్వాంగీణ వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, శారీరక విద్యతో పాటు యోగాను పాఠ్యాంశాల్లో భాగంగా చేయడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఏ కుమార్, మున్సిపల్ కమిషనర్, డివైఈవో శ్యాంసుందర్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థినులు ఉత్సాహంగా వివిధ యోగాసనాలు ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు.