విజయవాడలో కాస్ట్రో ఎనలేని స్ఫూర్తి పుస్తకావిష్కరణ
విజయవాడలో కాస్ట్రో ఎనలేని స్ఫూర్తి పుస్తకావిష్కరణ
విజయవాడ లెనిన్ సెంటర్లో సోషలిస్టు క్యూబా దేశాధ్యక్షుడు కామ్రేడ్ ఫిడెల్ కాస్ట్రో శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాలాంధ్ర ప్రజాశక్తి ప్రచురించిన ‘కాస్ట్రో ఎనలేని స్ఫూర్తి’ పుస్తకాన్ని రమాదేవి, అక్కినేని వనజ ఆవిష్కరించారు. కాస్ట్రో చిత్రంతో రూపొందించిన క్యాలెండర్ను వామపక్ష నాయకులు ఆవిష్కరించారు.
సభలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదిరించిన ధీరుడిగా ఫిడెల్ కాస్ట్రో చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఐదు దశాబ్దాల పాటు క్యూబాలో సోషలిస్టు పాలనను కొనసాగిస్తూ ప్రపంచ సామ్రాజ్యవాదానికి ఎదురొడ్డి నిలిచిన యోధుడు కాస్ట్రో అని కొనియాడారు. నేడు అమెరికా క్యూబాపై విధిస్తున్న ఆంక్షలు దురుద్దేశపూర్వకమైనవని విమర్శించారు.
ఇరాన్పై యుద్ధం సందర్భంగా క్యూబాపై దాడి చేస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికలను క్యూబా ప్రజలు ధైర్యంగా తిప్పికొట్టారని అన్నారు. అమెరికా క్యూబాపై కుట్రలు చేస్తోందని ఆరోపించారు. విద్యుత్, చమురు సరఫరాలు నిలిచిపోయిన క్లిష్ట పరిస్థితుల్లోనూ క్యూబా ప్రజలకు వామపక్షాలు మందులు అందించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. క్యూబాలో విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఢిల్లీలో జరిగిన నీట్ పరీక్షల కుంభకోణం దేశ ప్రతిష్టను దిగజార్చిందని హరినాథ్ విమర్శించారు. కోటి జనాభా ఉన్న క్యూబా అమెరికా సామ్రాజ్యవాదాన్ని గడగడలాడిస్తుంటే, 56 అంగుళాల ఛాతీ ఉందని చెప్పుకునే ప్రధాని మోదీ 146 కోట్ల మంది ప్రజలను అమెరికా పాదాక్రాంతం చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
సభకు గడ్డం కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, ఈశ్వరయ్య, పి. ప్రసాద్, జానకిరామయ్య తదితరులు ప్రసంగించారు.