ఆసుపత్రి టాయిలెట్లో నర్సు అనుమానాస్పద మృతి
ఆసుపత్రి టాయిలెట్లో నర్సు అనుమానాస్పద మృతి
కోల్కతా: ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న 30 ఏళ్ల మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కోల్కతాలో కలకలం రేపింది. నీల్రతన్ సిర్కార్ వైద్య కళాశాల, ఆసుపత్రిలోని గైనకాలజీ విభాగంలో పనిచేస్తున్న రూపాలి బర్మన్ బుధవారం రాత్రి విధులకు హాజరైంది.
రాత్రి సుమారు 10.20 గంటల సమయంలో హెచ్డీ విభాగంలోని టాయిలెట్కు వెళ్లిన రూపాలి చాలాసేపటికీ తిరిగి రాలేదు. దీంతో సహచర నర్సులు ఆమెను పిలిచినా లోపల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. చివరకు టాయిలెట్ తలుపును బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా రూపాలి నేలపై అపస్మారక స్థితిలో కనిపించింది.
వెంటనే ఆమెను ట్రాలీపై ఆసుపత్రి చికిత్స విభాగానికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించే సమయానికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రస్తుతం రూపాలి మృతికి ఖచ్చితమైన కారణం ఏమిటన్నది తెలియరాలేదు. ఆత్మహత్య కోణంలో ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని పోలీసులు పేర్కొన్నారు. టాయిలెట్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ ఆమెకు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు ఈ ఘటనను ఆరోగ్య శాఖ తీవ్రంగా పరిగణించింది. సంఘటనపై ప్రత్యేక విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేసింది. ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఆసుపత్రిలో భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించి ఏడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు, సీసీటీవీ దృశ్యాల పరిశీలన పూర్తయిన తర్వాతే నర్సు మృతికి అసలు కారణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.