బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం.. 400కు పైగా ఈవీ బైక్లు బుగ్గిపాలు
బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం.. 400కు పైగా ఈవీ బైక్లు బుగ్గిపాలు
బెంగళూరు: నగరంలోని కేఆర్ పురం ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పార్కింగ్ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ నిలిపి ఉంచిన 400కు పైగా విద్యుత్ ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.
పార్కింగ్ కేంద్రంలో పెద్ద సంఖ్యలో విద్యుత్ బైక్లు ఒకేచోట ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. అగ్నికీలలు ఎగసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే వందలాది బైక్లు పూర్తిగా కాలిపోయాయి.
దగ్ధమైన వాహనాలను జెప్టో, స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల పంపిణీ భాగస్వాములు వినియోగిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ ఘటన వల్ల ఆయా సంస్థల పంపిణీ సేవలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణమా? లేక ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పార్కింగ్ కేంద్రంలోని విద్యుత్ వ్యవస్థ, అగ్నిప్రమాదానికి ముందు అక్కడ చోటుచేసుకున్న పరిణామాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. భారీ సంఖ్యలో విద్యుత్ వాహనాలు ఒకేసారి దగ్ధం కావడంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ప్రమాదానికి అసలు కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది.