గూడూరు గెలాక్సీ మైన్లో అక్రమాల ఆరోపణలు.. విచారణ కోరుతున్న స్థానికులు
నెల్లూరు జిల్లా గూడూరు మండలం కందలి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గెలాక్సీ మైకా మైన్లో భారీ స్థాయిలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. లీజు గడువు ముగిసిన తర్వాత కూడా ప్రభుత్వ భూమిలో అక్రమ తవ్వకాలు, బ్లాస్టింగ్లు, పరిశ్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని వారు పేర్కొంటున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, సర్వే నంబర్ 68/4లోని సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు మొత్తం 95.38 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గెలాక్సీ మైన్కు ప్రభుత్వం మంజూరు చేసిన లీజు 2024 నవంబర్లో ముగిసింది. అయినప్పటికీ అక్కడి నుంచి ఖనిజ సంపదను తరలించేందుకు ఇప్పటికీ అనుమతులు జారీ అవుతున్నాయని ఆరోపిస్తున్నారు.
2013లోనే ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (IBM) ఈ మైన్పై చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రస్తుతం కూడా క్వార్జ్ తదితర ఖనిజాలను భారీ స్థాయిలో వెలికితీసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు అంటున్నారు. లీజు ముగిసిన మైన్లలో డంప్ మెటీరియల్ తరలింపునకు పరిమిత కాలమే అనుమతి ఉన్నప్పటికీ, గెలాక్సీ మైన్ విషయంలో నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు, బాల్ మిల్లింగ్ పరిశ్రమ ఏర్పాటు, ఫేక్ పత్రాలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ శాఖల కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు స్థానికుల నుంచి వస్తున్నాయి.
గెలాక్సీ మైన్కు సంబంధించిన పలు అంశాలు ప్రస్తుతం కోర్టుల పరిధిలో ఉన్నాయని, మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ఆరోపణలపై జిల్లా కలెక్టర్, మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.