మంచిర్యాలలో చిరు వ్యాపారుల షెడ్ల కూల్చివేత: ఉపాధి కోల్పోయామంటూ బాధితుల ఆవేదన
మంచిర్యాల బస్టాండ్, మార్కెట్ రోడ్ పరిసరాల్లో చిరు వ్యాపారులు దశాబ్దాలుగా ఏర్పాటు చేసుకున్న షెడ్లను ఏసీపీ ప్రకాశ్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు మంగళవారం జేసీబీలతో కూల్చివేశారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని, కనీసం వస్తువులు సర్దుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా ఒక్కసారిగా తమ ఉపాధిని లాగేసుకున్నారని బాధిత వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హఠాత్తుగా జరిగిన ఈ చర్యతో పదుల సంఖ్యలో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డామని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
అయితే, వ్యాపారుల ఆరోపణలపై మున్సిపల్ కమిషనర్ అన్వేష్ స్పందిస్తూ.. ఆక్రమణల తొలగింపునకు సంబంధించి ముందుగానే హెచ్చరికలు జారీ చేసి, నోటీసులు కూడా అందజేశామని స్పష్టం చేశారు. ఆ ప్రాంతాల్లో ఈ షెడ్ల వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రజా రవాణాకు ఆటంకం కలుగుతున్నందునే నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు