ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన పులి.. అప్రమత్తమైన అటవీ శాఖ
ఏలూరు జిల్లా పరిధిలో పులి సంచారం కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా అటవీ శాఖ పర్యవేక్షణలో ఉన్న పులి, తాజాగా నది దాటి పోలవరం జిల్లా నుంచి ఏలూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పులి సిరివాక పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ రెడ్డి తెలిపారు.
పులి కదలికలను గమనించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కొరుటూరు ప్రాంతంలోనే బస చేస్తూ పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు నదీ తీర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, బోన్లు, అవసరమైన పరికరాలు, వెటర్నరీ బృందాలను సిద్ధంగా ఉంచారు.
పులిని మత్తుమందు ఇచ్చి పట్టుకునే అవకాశాలపై కూడా అధికారులు పరిశీలన చేస్తున్నారు. అయితే పులి సంచరిస్తున్న ప్రాంతంలో జనావాసాలు లేవని, ప్రస్తుతం అది పాపికొండలు జాతీయ ఉద్యానవనం పరిధిలోనే ఉందని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.
ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు, అటవీ శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు జిల్లా, మండల స్థాయి యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉందని తెలిపారు. అలాగే గ్రామస్తులు నది పరివాహక ప్రాంతాల్లో చేపల వేట, పశువుల మేత కోసం వెళ్లవద్దని హెచ్చరించారు.
భద్రతా కారణాల దృష్ట్యా పేరంటపల్లి శివాలయం వరకు పర్యాటక కార్యకలాపాలను మూడు రోజుల పాటు నియంత్రించాలని టూరిజం శాఖకు అటవీ శాఖ లేఖ పంపినట్లు వెల్లడించారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.