గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం
గొల్లప్రోలు | ntodaynews.com
గొల్లప్రోలు పోలీసులు పశువుల అక్రమ రవాణాపై చర్యలు చేపట్టి 12 ఎద్దులను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విజయనగరం జిల్లా నామవరం ప్రాంతం నుంచి రాజానగరం వైపు బొలెరో వాహనంలో పశువులను తరలిస్తున్నారనే సమాచారం అందడంతో గొల్లప్రోలు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో స్థానిక టోల్ ప్లాజా సమీపంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా కత్తిపూడి నుంచి పిఠాపురం వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి పరిశీలించగా అందులో 12 ఎద్దులను తరలిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను రవాణా చేస్తున్నట్లు అనుమానించిన పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ ఘటనకు సంబంధించి యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామ పరిధిలోని అమీనాబాద్కు చెందిన కుందాల రవి, నామవరం గ్రామానికి చెందిన ఆవాల నూకరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
స్వాధీనం చేసుకున్న 12 ఎద్దులను భద్రతా కారణాల దృష్ట్యా సమీప గోశాలకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు
పశువుల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై రామకృష్ణ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను వాహనాల్లో తరలించడం నేరమని పేర్కొన్నారు. మూగజీవాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి కార్యకలాపాలపై పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తారని తెలిపారు.