జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ అమలు చేయాలి: ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం
ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)లో జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీ అమలుపై వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందిస్తూ, ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్ను తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.
జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ప్రైవేట్ పాఠశాలలు, విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే సంబంధిత సర్కులర్ను మండల విద్యాశాఖ అధికారులకు (ఎంఈఓలు) సకాలంలో ఫార్వర్డ్ చేయని విద్యాశాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని, జర్నలిస్టుల పిల్లలకు అందాల్సిన ఫీజు రాయితీ ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం సహించబోమని హెచ్చరించారు. జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో అందించేలా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.