డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ కార్యక్రమాలు నిర్వహించిన చాట్రాయి మండల బీజేపీ శ్రేణులు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కృష్ణారావుపాలెంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ కార్యక్రమాలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బూత్ నంబర్-1 అధ్యక్షుడు చిట్టెం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి పాల్గొని ముఖర్జీ సేవలను స్మరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ను ప్రతి సంవత్సరం జూన్ 23న దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిర్వహిస్తాయని తెలిపారు. 1953 జూన్ 23న కాశ్మీర్లో నిర్బంధంలో ఉన్న సమయంలో ఆయన ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. 1901 జూలై 6న కోల్కతాలో జన్మించిన ముఖర్జీ ప్రముఖ విద్యావేత్త, న్యాయవాది, రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారని చెప్పారు. స్వతంత్ర భారతదేశ తొలి కేంద్ర మంత్రివర్గంలో పరిశ్రమలు, పౌర సరఫరాల శాఖ మంత్రిగా సేవలందించారని పేర్కొన్నారు.
1951లో భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించిన డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ, జాతీయ ఐక్యతకు కట్టుబడి పనిచేశారని తెలిపారు. "ఒకే దేశంలో రెండు విధానాలు, రెండు ప్రధానులు, రెండు జెండాలు ఉండకూడదు" అనే నినాదంతో జమ్మూ-కాశ్మీర్ సంపూర్ణ ఏకీకరణ కోసం ఉద్యమించారని చెప్పారు. అనంతరం అదే భావజాలాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు చేయడం ద్వారా కాశ్మీర్ను దేశ ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు.
దేశ సమైక్యత, జాతీయ సమగ్రత, దేశభక్తి కోసం డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు "భారత్ మాతాకీ జై" నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, చిట్టెం వాణి, చిన్నారి, నాగమణి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.