www.ntodaynews.com
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. విద్యార్థులకు అవగాహన కల్పించిన బొమ్మలరామారం ఎస్సై
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
బొమ్మలరామారం
బొమ్మలరామారం | ntodaynews.com
మత్తు పదార్థాలు, గంజాయి వంటి చెడు వ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని బొమ్మలరామారం ఎస్సై బుగ్గ శ్రీశైలం సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, యువతపై వాటి ప్రభావం గురించి విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలైతే భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు.
అనంతరం విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. శారీరక, మానసిక దృఢత్వం కోసం విద్యార్థులు క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ఎస్సై శ్రీశైలం మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, ప్రతి విద్యార్థి ఉత్తమ పౌరుడిగా ఎదిగేలా తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నియంత్రించాలని సూచించారు.
డ్రగ్స్, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయం, రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ ప్రాంతంలో ఎవరైనా మత్తు పదార్థాల విక్రయం లేదా రవాణా చేస్తున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.