ప్రభుత్వ ఖాతాలు, డిపాజిట్లపై తెలంగాణ సర్కార్ ఆరా
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించి భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)లో ఎన్ని ఖాతాలు ఉన్నాయి, వాటిలో ఎంత మేరకు డిపాజిట్లు ఉన్నాయనే వివరాలను తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులకు లేఖలు పంపి పూర్తి సమాచారాన్ని అందించాలని ఆదేశించింది.
ఇటీవల ఎస్బీఐకి సంబంధించిన భూమిని ప్రభుత్వం వేలం వేయడం, ఆ చర్యపై బ్యాంకు అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఎస్బీఐలో ఉన్న ప్రభుత్వ డిపాజిట్లను వెనక్కి తీసుకోవాలని, ఇకపై ప్రభుత్వ శాఖలు ఎస్బీఐ ద్వారా లావాదేవీలు నిర్వహించకుండా చూడాలని ముఖ్యమంత్రి మౌఖికంగా సూచించినట్లు తెలుస్తోంది. అలాగే భవిష్యత్తులో ఎస్బీఐలో కొత్తగా డిపాజిట్లు చేయాలంటే ముందుగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని అన్ని శాఖలకు సమాచారం పంపినట్లు తెలిసింది.
దీంతో ప్రభుత్వ నిధుల నిర్వహణ, బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.