www.ntodaynews.com
అయ్యప్ప స్వామి ఆలయంలో వరుస చోరీలు.. గ్రామస్తుల్లో ఆందోళన
తెలంగాణ
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో పట్టపగలే చోరీ ఘటన చోటుచేసుకుంది. ఆలయం కింద ఉన్న గది తలుపులు పగులగొట్టి దొంగలు లోనికి ప్రవేశించినట్లు తెలుస్తోంది.
దొంగలు దాదాపు 100 కలశాలు, 45 రాగి, ఇత్తడి దీప కుందులు సహా పలు విలువైన వస్తువులను అపహరించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కాగా, గత రెండు రోజుల వ్యవధిలోనే ఇదే దేవాలయంలో మూడు సార్లు చోరీలు జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ ఘటనపై ఆలయ నిర్వాహకులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. వరుస దొంగతనాలతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతుండగా, నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.