కందుకూరులో ఉచిత వైద్య శిబిరం విజయవంతం
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో సత్తుపల్లికి చెందిన న్యూ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. హాస్పిటల్ అధినేత డా. సురేష్ రామాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మందపాటి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శిబిరంలో ప్రముఖ ముక్కు, చెవి, గొంతు వైద్య నిపుణుడు డా. ముదిశెట్టి ఉమేష్, జనరల్ మెడిసిన్ వైద్యురాలు డా. లహరి భీమిరెడ్డి గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. అవసరమైన వారికి వైద్య సలహాలు, చికిత్సకు సంబంధించిన సూచనలు అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. న్యూ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది శిబిరం నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు.
డా. సురేష్ రామాల మాట్లాడుతూ సత్తుపల్లిలో మొట్టమొదటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా న్యూ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని విభాగాల్లో నైపుణ్యం కలిగిన వైద్యులతో 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు.
తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన, సత్తుపల్లి మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.