ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యాసంస్థల్లో జెండా ఆవిష్కరణ...
ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యాసంస్థల్లో జెండా ఆవిష్కరణ...
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.
అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని 91వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భంగా పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా"టి.జనార్ధన్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా" టి.జనార్ధన్ ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, సరిపడా బెడ్లు, విద్యుత్, ఫ్యాన్లు, భద్రత వంటి కనీస వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని కోరారు. హాస్టళ్లలో వసతుల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.
పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతోందని, విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
అదేవిధంగా కళాశాలల్లో అర్హత కలిగిన అధ్యాపకులను నియమించడం, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, కంప్యూటర్ సదుపాయాలను మెరుగుపరచడం అవసరమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని కోరారు.
ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయకుండా విద్యార్థులపై ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల భారం పెంచడం సరికాదన్నారు. ప్రైవేటు కళాశాలల్లో అధిక ఫీజులు, అనవసరమైన వసూళ్లు, విద్యార్థులపై ఒత్తిడి వంటి సమస్యలను అధికారులు పరిశీలించి నియంత్రించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య హక్కుగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.
విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలని, పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ మరియు మార్గదర్శకత్వం అందించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మున్నా, ఎఐటియుసి నాయకులు వెంకటరమణారెడ్డి, AISF నాయకులు హసన్ తదితరులు పాల్గొన్నారు.