అల్పపీడనం ఎఫెక్ట్.. నేటి నుంచి భారీ వర్షాలు
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రానున్న రెండు రోజుల్లో ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశమున్నట్లు వెల్లడించింది.
దీని ప్రభావంతో తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాల ప్రభావం అధికంగా ఉండనుంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, పల్నాడు జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ తెలిపారు. మిగతా ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.