చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం
బద్వేలు | కడప జిల్లా | N Today News
చెక్కు బౌన్స్ కేసులో తిరుపతికి చెందిన ఓ మహిళకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ బద్వేలు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అలాగే ఫిర్యాదుదారుడికి రూ.50 లక్షలు చెల్లించాలని కూడా ఆదేశించింది.
కేసు వివరాల ప్రకారం, బద్వేలుకు చెందిన విశ్రాంత వైద్యుడు రామప్రసాద్ 2016లో తిరుపతికి చెందిన విజయమ్మకు రూ.50 లక్షలను అప్పుగా ఇచ్చారు. ప్రారంభంలో కొంతకాలం వడ్డీ చెల్లించినప్పటికీ, నిర్ణయించిన గడువులోపు అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తరువాత పెద్దల సమక్షంలో జరిగిన చర్చల అనంతరం, బాకీ మొత్తానికి సంబంధించి విజయమ్మ చెక్కులు అందజేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ చెక్కులు బ్యాంకులో సమర్పించగా ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో అవి బౌన్స్ అయ్యాయి.
దీంతో ఫిర్యాదుదారుడు 2020లో బద్వేలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన కోర్టు, అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా నేరం రుజువైనట్లు నిర్ధారించి నిందితురాలికి ఏడాది జైలు శిక్ష విధించింది.
అదేవిధంగా, అప్పుగా తీసుకున్న రూ.50 లక్షలను ఫిర్యాదుదారుడు రామప్రసాద్కు చెల్లించాలని కోర్టు తన తీర్పులో ఆదేశించింది.