రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా?
రాజంపేట రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా?
గత ఎన్నికల్లో టికెట్ దక్కక రాజకీయంగా సైలెంట్ అయిన మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి మళ్లీ రాజంపేట రాజకీయాల్లో చురుకుగా కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు అడుగులు వేస్తారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
గత ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న మేడా మల్లికార్జున్ రెడ్డి ఇటీవల రాజంపేట నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ శ్రేణులతో సమావేశమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు మొదలయ్యాయి.
మేడా మల్లికార్జున్ రెడ్డి 2014 ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు. అనంతరం 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన రాకతో రాజంపేటలో అప్పటి నుంచే స్థానిక నాయకత్వంలో వర్గపోరు చర్చకు వచ్చింది.
అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వగా, ఆయన విజయం సాధించారు. ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఒకరు.
ఇదిలా ఉండగా, మేడా మల్లికార్జున్ రెడ్డి మళ్లీ వైసీపీలో యాక్టివ్ అయితే స్థానికంగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వర్గం ఎలా స్పందిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆయన కూటమి పార్టీల వైపు అడుగులు వేస్తారనే ప్రచారం కూడా సాగుతున్నప్పటికీ, దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాలే. మేడా మల్లికార్జున్ రెడ్డి భవిష్యత్తు రాజకీయ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.