వినగడప–తోటమూల మధ్య కట్టలేరు వాగుపై తప్పని వరద కష్టాలు
వినగడప–తోటమూల మధ్య కట్టలేరు వాగుపై తప్పని వరద కష్టాలు
స్వల్ప వర్షానికే తాత్కాలిక రహదారిపైకి వరద నీరు.. ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న శాశ్వత వంతెన
ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం:
గంపలగూడెం మండలం వినగడప–తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగు వద్ద వరద కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. నిన్న కురిసిన స్వల్ప వర్షానికే వాగులో నీటి ప్రవాహం పెరిగి తాత్కాలిక రహదారిపై అర అడుగు మేర వరద నీరు చేరింది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎనిమిదేళ్ల క్రితం భారీ వర్షాలకు కట్టలేరు వాగుపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రతి వర్షాకాలంలో ఈ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న రహదారి వరదలకు కొట్టుకుపోవడం, మళ్లీ పునర్నిర్మాణం చేయడం ఏటా పునరావృతమవుతోంది.
ఈ మార్గం ద్వారా ప్రయాణించే సమీపంలోని సుమారు 20 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గంలో సుమారు 30 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రతిసారి తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది పెద్దగా వర్షాలు లేక ఊపిరి పీల్చుకున్న గ్రామాల ప్రజలకు, తాజాగా కురిసిన కొద్దిపాటి వర్షానికే వాగులో నీటి ప్రవాహం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
కట్టలేరు వాగుపై శాశ్వత వంతెన నిర్మించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న వంతెన నిర్మాణం ఎప్పటికి సాకారం అవుతుందోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.