ఏటూరునాగారం: నూతన వాణిజ్య విధానంతో వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కార్పొరేట్ లాభాల కోసమే విత్తన చట్టంలో మార్పులు
ఏటూరునాగారం: నూతన వాణిజ్య విధానంతో వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కార్పొరేట్ లాభాల కోసమే విత్తన చట్టంలో మార్పులు
కేంద్ర రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు రైతు సంఘం పిలుపు
నవంబర్లో నల్లగొండలో కిసాన్ సభ జాతీయ మహాసభలు
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు
ఏటూరునాగారం, ఆగస్టు 28:
కేంద్ర ప్రభుత్వం నూతన వాణిజ్య విధానం పేరుతో దేశీయ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడుతోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు విమర్శించారు. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే కొత్త విత్తన చట్టంలో మార్పులు తీసుకొస్తున్నారని ఆరోపించారు. రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో గురువారం రైతు సంఘం విస్తృత స్థాయి సమావేశం గపూర్ పాషా అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముందు రైతు ఉద్యమ నేత సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత పన్నెండేళ్లుగా రైతులకు నష్టం కలిగించే విధానాలను అవలంబిస్తోందని అన్నారు. రైతులకు నష్టం చేసే మూడు వ్యవసాయ చట్టాలను తీసుకురాగా, వాటికి వ్యతిరేకంగా రైతులు 385 రోజుల పాటు పోరాటం చేసి వాటిని వెనక్కి తీసుకునేలా చేశారని గుర్తు చేశారు.
అయితే ప్రస్తుతం దొడ్డిదారిన ప్రైవేటు విత్తన చట్టాన్ని తీసుకొచ్చి విత్తనాలపై రైతుల హక్కులను దెబ్బతీసేలా, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరేలా చర్యలు చేపడుతున్నారని విమర్శించారు.
నూతన వాణిజ్య విధానం పేరుతో అమెరికా, కెనడా, న్యూజిలాండ్ తదితర దేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసేందుకు ప్రయత్నించడం వల్ల దేశ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. దేశంలో 52 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని, అలాంటి రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నల్లగొండ జిల్లాలో నవంబర్ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న 36వ ఏఐకేఎస్ అఖిల భారత మహాసభలను రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో రైతు సంఘం సీనియర్ నాయకులు సూడి కృష్ణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు, తుమ్మల వెంకట్రెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండీ దావూద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తీగల ఆదిరెడ్డి, చిట్టెం ఆదినారాయణ, వడకాపురం సారయ్య, ఎండీ యాకూబ్, బండారి నరసింహులు, ఎల్పీ ముత్యాలు, మంచాల రామారావు, గుండు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.