గంజాయి ముఠాపై నల్లగొండ పోలీసుల ఉక్కుపాదం....
గంజాయి ముఠాపై నల్లగొండ పోలీసుల ఉక్కుపాదం.. ఐదుగురు అరెస్ట్ ఒకరు పరారీ
- గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం : డీఎస్పీ శివరాం రెడ్డి
నల్లగొండ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని నల్లగొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి తెలిపారు. గంజాయి సేవించినా, విక్రయించినా ఎంతటి వ్యక్తి అయినా ఉపేక్షించబోమని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలతో పాటు బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును నల్లగొండ టూ టౌన్ పోలీసులు చేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నల్లగొండ రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయిని పంచుకుంటున్న సమయంలో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.25 వేల విలువైన 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే దొంగతనానికి గురైన నాలుగు మోటార్సైకిళ్లు, ఐదు సెల్ఫోన్లను రికవరీ చేశారు. విచారణలో ఒడిశా నుంచి నల్లగొండకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కో 20 గ్రాముల ప్యాకెట్ను రూ.500కు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గంజాయి కొనుగోలు కోసం దొంగిలించిన ఓ బైక్ను ఒడిశాలో కుదువ పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. నల్లగొండలోని హనుమాన్నగర్, గాంధీనగర్, కామేశ్వర్రావు కాలనీలతో పాటు హైదరాబాద్ వనస్థలిపురంలోనూ బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో పలువురిపై గతంలోనే గంజాయి, దొంగతనం తదితర కేసులు ఉన్నట్లు తెలిపారు. డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో, టూ టౌన్ సీఐ కే. ఆది రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఈ దాడులు నిర్వహించింది. ఎస్ఐలు డి. సైదాబాబు, అహ్మద్ షరీఫ్తో పాటు సిబ్బంది లావూరి బాలకోటి, మహమ్మద్ షకీల్ తదితరులు ఆపరేషన్లో పాల్గొన్నారు. సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
* మిషన్ పరివర్తన్’లో భాగంగా చర్యలు
‘మిషన్ పరివర్తన్’లో భాగంగా గంజాయి సేవించే వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. యువత గంజాయి మత్తుకు బానిస కాకుండా కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. గంజాయి సంబంధిత సమాచారం ఉంటే 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.